మతం మారినా కుల వివక్ష పోదని వ్యాఖ్య – గద్దర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు

మేడ్చల్, ఆగస్టు 7 (బీబీఎంఏ న్యూస్): హైదరాబాద్‌లోని నాచారంలో గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల హక్కులు, ఎస్సీ రిజర్వేషన్లపై సమావేశం నిర్వహించారు. బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు మతం మారినంత మాత్రాన కుల వివక్ష అంతం కాదని, దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ల హక్కు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సామాజిక న్యాయం అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు బుచ్చిగారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళిత క్రైస్తవుల సమస్యలు, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల అమలుపై విస్తృతంగా చర్చించారు. గద్దర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.